27న సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు కూతవేటు దూరంలో కాంగ్రెస్ 'రచ్చబండ' కార్య‌క్ర‌మం

Congress Rachabanda Programme On Dec 27th. గత మూడు నెలలుగా రైతులు హరిగోస పడుతున్నారని.. కల్లాల్లో వరి కుప్పలు, ఇంటి ముందు

By Medi Samrat  Published on  24 Dec 2021 12:46 PM GMT
27న సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు కూతవేటు దూరంలో కాంగ్రెస్ రచ్చబండ కార్య‌క్ర‌మం

గత మూడు నెలలుగా రైతులు హరిగోస పడుతున్నారని.. కల్లాల్లో వరి కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉంది పరిస్థితని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ మోడీని కలవలేదు, రైతు సమస్య వివరించలేదని.. కేటీఆర్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గడ్డి పెట్టి పంపించారని విమ‌ర్శించారు. వరంగల్ గోడౌన్ లోని 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్ మాల్ పై కేంద్రం నిలదీస్తే దొంగళ్ల పారిపోయి వచ్చారని ఆరోపించారు. సెంట్రల్ హాల్ లో ఫోటోలు దిగి పార్లమెంట్ లో ఆందోళన చేసినట్లు తప్పుదోవపట్టిస్తున్నారని మండిప‌డ్డారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని.. మంత్రుల బృందం ఏం తేల్చిందని ప్ర‌శ్నించారు.

ఖరీఫ్ పంట టార్గెట్ పూర్తిగా ఎందుకు సరఫరా చేయలేదో రైతులకు, కేంద్రానికి చెప్పాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంత సరఫరా చేస్తారో చెప్పకుండా అదనపు పంట కొంటామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలనడం హాస్యాస్పదం అని అన్నారు. యాసంగి పంట గురించి ఎందుకు నిలదీయడం లేదని.. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్ రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని విమ‌ర్శించారు. ఆరు రోజులుగా కేటీఆర్, సంతోష్ ఎక్కడున్నారు.. గోవా లో ఉన్నారా, దుబాయ్ లో ఉన్నారా.. మంత్రుల బృందంలో కేటీఆర్, ఎంపీల బృందంలో సంతోష్ రావు ఎందుకు లేరని ప్ర‌శ్నించారు.

ఖరీఫ్ లో ఎంత కొంటారో చెప్పేవరకు, యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పేవరకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండని సూచించారు. ఏది తేలకుండా మంత్రుల బృందం వెనక్కి వస్తే మిమ్మల్ని ఆడంగులు, కొజ్జాలు అనాల్సి వస్తుందని.. మీకు గాజులు, చీరెలు ఇవ్వాల్సి వస్తుందని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి వీధినాటకాలకు తెరలేపారని.. రైతులు ఎవరూ చనిపోవద్దు, కాంగ్రెస్ అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తామ‌ని తెలిపారు. రైతులంతా ఎర్రవెల్లికి రావాలని.. టీపీసీసీ ముఖ్యనేతలంతా ఇందులో పాల్గొంటారని.. కేసీఆర్, మోదీ ఒక్కటేనని వివరిస్తామ‌ని రేవంత్ రెడ్డి అన్నారు.


Next Story