బీజేపీ ఆదేశాలతో.. అదానీతో సీఎం రేవంత్‌ అలయ్‌ బలయ్: కేటీఆర్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీతో కలిసి పనిచేస్తోందని బీఆర్‌ఎస్ కేటిఆర్ వ్యాఖ్యానించారు.

By అంజి  Published on  18 Jan 2024 10:08 AM GMT
Telangana, Congress govt,  Adani, BJP, KTR

బీజేపీ ఆదేశాలతో.. అదానీతో సీఎం రేవంత్‌ అలయ్‌ బలయ్: కేటీఆర్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీతో కలిసి పనిచేస్తోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కెటి రామారావు (కేటిఆర్) వ్యాఖ్యానించారు. జనవరి 18వ తేదీ గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో అదానీతో పోరాడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు కలిసి పని చేస్తోంది? మోదీ, అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ జాతీయ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, అదానీ ఒక్కటే అన్నారు. సీఎం రేవంత్‌ ఇప్పుడు దావోస్‌లో అదానీతో అలయ్‌ బలయ్‌ చేస్తున్నారు.

ఇది అవకాశవాద, నీచ స్థాయి రాజకీయం అని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో పలు వ్యాపారాలలో రూ.12400 కోట్ల పెట్టుబడులను ప్రకటించిన ఒక రోజు తర్వాత కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు ఎంవోయూలను కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది.

కేటీఆర్‌ ఇంకా మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని హామీ ఇచ్చిన పాత పార్టీ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. "కాంగ్రెస్ చేసిన మొత్తం వాగ్దానాల సంఖ్య 420. వాటి గురించి ప్రజలకు, అధికార పార్టీకి గుర్తు చేయడం మా కర్తవ్యం" అని ఆయన అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు అని అన్నారు.

Next Story