తెలంగాణలో మే 10వ తేదీన ప్రారంభంకానున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్కు మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎం రేవంత్కు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలి. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి అని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం సూచించారు. సిటీలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.