కాళేశ్వరం అంశంపై రెండ్రోజుల్లో హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, అన్ని అంశాలు చెప్తాను..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన ముగిసిన సందర్భంగా మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై తన అభిప్రాయాన్ని కేసీఆర్ చెప్పారు. ఎల్లుండి నేను చెప్తా. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు బయటపెడతానని చెప్పారు. నేను ఉన్నంత వరకు కాంగ్రెస్లోకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదు. రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువు..అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని తెలిపారు. కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్ఠానం వద్ద చర్చలు జరిగాయన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతోంది కిషన్రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ ఆయన నిధులు సాధించలేదని విమర్శించారు.