హైదరాబాద్: పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ..అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. అందెశ్రీని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర ఉండాలని కోరాను. గద్దర్ అన్నతో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారు. ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపింది..రేవంత్ అన్నారు.
అందె శ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం, ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తాం. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్ గా ఉపయోగపడుతుంది. అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో “నిప్పుల వాగు” ను అందుబాటులో ఉంచుతాం, అందెశ్రీ కి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశాం . ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తాం. వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గా వారిని పద్మశ్రీ తో గౌరవించుకునేందుకు కృషి చేద్దాం..అని సీఎం పేర్కొన్నారు.