దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నర్సింహరావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పీవీ జ్ఞానభూమి వద్ద ఆయనకు నివాళులర్పించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారని.. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పినట్లు గుర్తుచేశారు.
భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నర్సింహరావు అన్నారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని.. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం అన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని అన్నారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.