అప్పుడు ఆయన అధ్యక్షుడు.. చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో పని చేశారు
హనుమంత రావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 14 Feb 2025 8:04 PM IST
హనుమంత రావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క కూడా యూత్ కాంగ్రెస్ నుండి వచ్చారని.. రాజకీయాలకు యూత్ కాంగ్రెస్ మొదటి మెట్టు అన్నారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసిన వెంకట్ టీమ్ జైల్లో ఉంటే రాహుల్ గాంధీ పరామర్శించి అండగా ఉన్నారని.. వెంకట్ ఎమ్మెల్సీ అయిండు, యూత్ కాంగ్రెస్ లో పని చేసిన అనిల్ కుమార్ రాజ్యసభ సభ్యుడు అయ్యాడని పేర్కొన్నారు. పదవులు రావొచ్చు.. రాకపోవచ్చు.. కానీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు.
కేసీఆర్ గట్టిగా కొడతా అంటుండు.. కేసీఆర్ గట్టిగా కొట్టాలంటే నీ కొడుకును కొట్టు.. వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు.. నీ బిడ్డను వీపు పగల కొట్టు.. ఢిల్లీలో కేజ్రీవాల్ ను ఓడగొట్టినందుకు.. నీ అల్లుణ్ని బండకేసి కొట్టు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లారీల కొద్ది డబ్బులు ఉన్నాయి.. కానీ ఎందుకు ఓడి పోయిండు.. ముందు బయటకు వచ్చి సరిగ్గా నిలబడు కేసీఆర్.. డబ్బులతో గెలవొచ్చు అనుకుంటే అది పొరపాటు అన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు బుగ్గకార్లలో తిరగడం కాదు.. తెలంగాణ కోసం ఏమి తెచ్చారో చెప్పాలన్నారు. త్వరలో కేంద్రంపై పోరాటానికి కార్యాచరణ ఉంటది.. యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడగానే అనుబంధ విభాగాలకు 37 కార్పొరేషన్ పదవులు ఇచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ యూత్ కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఉంటుందన్నారు. ఢిల్లీ కోటలో.. ఇక్కడ ఎదో వస్తది అనుకుంటే దండగ.. పని చేయకుండా దండం పెడతాం అంటే పదవులు మర్చిపోండి.. ప్రజా సమస్యలపై పోరాడితేనే పదవులు అని స్పష్టం చేశారు.