మనది రైజింగ్ తెలంగాణ.. అదే మ‌న కర్తవ్యం : సీఎం రేవంత్ రెడ్డి

సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat
Published on : 5 Nov 2024 8:30 PM IST

మనది రైజింగ్ తెలంగాణ.. అదే మ‌న కర్తవ్యం : సీఎం రేవంత్ రెడ్డి

సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన సంప్రదింపుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ఇక్కడకు రావడం గొప్ప విషయం.. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారన్నారు. మాటలు కాదు.. చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన.. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారన్నారు.

రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యం అన్నారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. ఇందులో ఓసీలు-3076 (9.8%), ఈడబ్ల్యూఎస్- 2774 (8.8%), ఓబీసీలు-17,921(57.11%), ఎస్సీలు-4828 (15.3%), ఎస్టీలు-2783 (8.8%) ఉన్నార‌ని వివరించారు.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శన అని పేర్కొన్నారు. మనది రైజింగ్ తెలంగాణ అన్నారు. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యం అన్నారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామ‌ని తెలిపారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామ‌న్నారు.

Next Story