కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం: తెలంగాణ సీఎం

తెలంగాణ విద్యా విధానంపై అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు

By -  Knakam Karthik
Published on : 17 Sept 2025 5:32 PM IST

Telangana, Cm Revanthreddy, Telangana education policy, Government Of Telangana

హైదరాబాద్: తెలంగాణ విద్యా విధానంపై అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో కమిటీ సభ్యులు కె కేశవ రావు, ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్టా రెడ్డి. ఎంఎల్సీ లు కోదండరాం, శ్రీపాల్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, విద్యావేత్తలు, అన్ని యూనివర్సిటీల ఉప కులపతులు , సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఉన్నతాధికారులు. పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయి. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదు. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. వారిలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుంది. విద్యా శాఖకు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుంది. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంమే నా ధ్యేయం. అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలి. పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దంగా పనిచేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్‌లో లోపాలు ఉన్నాయి. 11 వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రి ని కోరాను. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా నేను సిద్ధం..అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Next Story