సిటీలో వరద సమస్యకు అదొక్కటే మార్గం..అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik
సిటీలో వరద సమస్యకు అదొక్కటే మార్గం..అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండటమే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు సీఎంకు వివరించారు.
కాగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వరదనీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ చెరువు, నాలాలు, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎక్కడ వర్షం పడినా ఆ నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. భవిష్యత్లో నగరంలో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని సీఎం గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీ పునరుజ్జీవనంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ దిశగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలని..అధికారులను ఆదేశించారు.