'34 వైద్య కళాశాలల్లో పూర్తి వసతులు'.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల‌లు పూర్తి స్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వెంట‌నే త‌యారు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

By అంజి
Published on : 17 Jun 2025 6:59 AM IST

CM Revanth Reddy, officials, facilities, medical colleges, Telangana

'34 వైద్య కళాశాలల్లో పూర్తి వసతులు'.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల‌లు పూర్తి స్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వెంట‌నే త‌యారు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం అధికారుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ఆ క‌మిటీ రాష్ట్రంలోని ప్ర‌తి క‌ళాశాల‌ను సంద‌ర్శించి సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి జాతీయ వైద్య మండలి లేవనెత్తిన పలు అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి సమీక్షించారు.

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో నియామ‌కాలు, బోధ‌న సిబ్బంది ప్ర‌మోష‌న్లు, వాటికి అనుబంధంగా ఉన్న ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల పెంపు, ఆయా క‌ళాశాల‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాలు, ఖాళీల భ‌ర్తీ వంటి అన్ని అంశాలపైనా స‌మ‌గ్ర నివేదిక రూపొందించి అందించాల‌ని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి విడుద‌ల చేయాల్సిన నిధులను వెంట‌నే విడుద‌ల చేస్తామ‌న్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమ‌తులకు సంబంధించిన అంశాలుంటే వెంట‌నే తెలియజేయాల‌ని, కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాతో పాటు ఆ శాఖ అధికారుల‌ను సంప్ర‌దించి వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు.

న‌ర్సింగ్ క‌ళాశాల‌ల్లో జ‌ప‌నీస్ (జ‌పాన్ భాష‌) ను ఒక ఆప్ష‌నల్‌గా నేర్పించాల‌ని, జ‌పాన్‌లో న‌ర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో మ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు జ‌పాన్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగులు, వారిని ప‌రీక్షించే వైద్యులు, ఆసుప‌త్రుల స‌మ‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. విద్యా, వైద్య రంగాలు ఎంతో కీల‌క‌మ‌ని, ప్ర‌తి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖ‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించారు.

Next Story