Telangana: రైతు రుణమాఫీపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. ఖండించిన సీఎం రేవంత్
పంట రుణమాఫీ పథకం విజయవంతంగా అమలు కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.
By అంజి Published on 7 Oct 2024 10:18 AM IST
Telangana: రుణమాఫీపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. ఖండించిన సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్రంలో పంట రుణమాఫీ పథకం విజయవంతంగా అమలు కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మోదీకి లేఖ రాశారు. ప్రధాని వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో వాస్తవికతను ప్రతిబింబించనందున తనకు బాధగానూ, ఆశ్చర్యంగానూ ఉందని మోదీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేశామని ఎక్స్ పోస్ట్లో తెలిపారు. "ప్రియమైన నరేంద్రమోదీ జీ - తెలంగాణలో రైతుల రుణమాఫీ గురించి ప్రస్తావించిన మీ ప్రసంగానికి ప్రతిస్పందనగా - మా పాలన యొక్క మొదటి సంవత్సరంలోనే దాని విజయవంతమైన అమలు గురించి నేను అన్ని వాస్తవాలను పంచుకుంటున్నాను" అని ఆయన అన్నారు.
"మా ప్రభుత్వంలో... రూ. 2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని వాగ్దానం చేసిన విధంగా పూర్తిగా మాఫీ చేశాం. దీని ద్వారా మొత్తం 22,22,067 మంది రైతులకు రూ. 17,869.22 కోట్లు మాఫీ చేశాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీ" అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. .
రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు రూ.2 లక్షల పరిమితి కంటే ఎక్కువ మొత్తాన్ని క్లియర్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మాఫీని అమలు చేస్తుందని ఆయన చెప్పారు. "మా రైతులు కాంగ్రెస్ గ్యారెంటీని బంగారు హామీ అని నమ్ముతారు. మా ప్రయత్నాలు రైతుల సంక్షేమం కోసం మా అంకితభావాన్ని ప్రదర్శిస్తాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ చొరవ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను" అని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ఈ ప్రయత్నంలో మోడీ యొక్క "పూర్తి" సహకారం, మార్గదర్శకత్వాన్ని తాను అభ్యర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అక్టోబరు 5న మహారాష్ట్రలో జరిగిన ర్యాలీల్లో ప్రసంగించిన మోదీ.. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, కర్ణాటకలో బీజేపీ హయాంలో ప్రారంభించిన సాగునీటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు.
కాగా, వామపక్ష తీవ్రవాదంపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశరాజధాని పర్యటనలో ఆయన ఏఐసీసీ నేతలతోనూ సమావేశం కానున్నారు.