తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత జైలుకు వెళితే కేటీఆర్, హరీశ్ రావు ముఖ్యమంత్రి అవుదామని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మన ఇంటి బిడ్డను బాగా చూసుకుంటే ఏ సమస్య ఉండదని అన్నారు. ఇంటి సమస్యను కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. కలిసి సంపాదించారు.. పంపకాల్లో తేడా రావడంతో ఇప్పుడు కొట్టుకుంటున్నారని విమర్శించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యవహారమని ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. కానీ తెలంగాణలోని అన్ని దేవాలయాలలో విజయ డెయిరీ నెయ్యినే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడుతూ.. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక వ్యక్తి అన్నారు. అతడు 20 నెలలు విదేశాల్లో ఉన్నారని, భారత్కు తీసుకు రావడానికి కేంద్రం సహకరించలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును స్వదేశానికి తీసుకు వచ్చామని అన్నారు. ఆ తర్వాతే కేసు విచారణ వేగవంతమైందని ముఖ్యమంత్రి తెలిపారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మనకు నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి అన్నారు. తాను ఏ ఎన్నికైనా సీరియస్గానే తీసుకుంటానని అన్నారు.