నాకు టైమ్ ఇస్తే ఇంట్లో సామాను తీసుకుని బయటకి వెళ్తా.. నోటీసుల‌పై సీఎం సోద‌రుడు

దుర్గం చెరువు సమీపంలోని ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న‌ కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

By Medi Samrat  Published on  29 Aug 2024 11:04 AM GMT
నాకు టైమ్ ఇస్తే ఇంట్లో సామాను తీసుకుని బయటకి వెళ్తా.. నోటీసుల‌పై సీఎం సోద‌రుడు

దుర్గం చెరువు సమీపంలోని ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న‌ కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. అమర్ సొసైటీలోని తిరుపతి రెడ్డి నివాసానికి కూడా హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై తాజాగా తిరుపతి రెడ్డి స్పందించారు.

నా ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలని తిరుపతి రెడ్డి అన్నారు. నాకు టైమ్ ఇస్తే ఇంట్లో సామాను తీసుకుని బయటకి వెళ్తాన‌ని స్ప‌ష్టం చేశారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకూ నాకు ఏ అధికారి కలువలేదన్నారు. నేను 2016-17లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశానని.. నివాసానికి కొనుగోలు చేసినప్పుడు ఈ బిల్డింగ్ FTL లో ఉంది అన్న సమాచారం నా దగ్గర లేదన్నారు. నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని.. వాళ్ల‌ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. 1995 లోనే ఈ లే ఔట్ కి పర్మిషన్ వచ్చిందని.. బీఆర్ఎస్ వాళ్ళు నా ఇంటిని ప‌ట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు. వాళ్లు గత పదేళ్ళలో ఎన్నో అక్రమాలు చేశారని అన్నారు.


Next Story