తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను అలర్ట్‌ చేసిన సీఎం రేవంత్‌

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

By అంజి
Published on : 25 July 2025 6:41 AM IST

CM Revanth, officials, heavy rains, Telangana

తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను అలర్ట్‌ చేసిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్​ హైదరాబాద్​తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉదృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.

Next Story