నాలుగు నెల‌ల క్రితం నా ఇంటికి వ‌చ్చి ఏం మాట్లాడావో గుర్తుందా..? : కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ త‌న‌పై చేసిన ఆరోపణలపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పందించారు.

By Medi Samrat
Published on : 26 July 2025 3:26 PM IST

నాలుగు నెల‌ల క్రితం నా ఇంటికి వ‌చ్చి ఏం మాట్లాడావో గుర్తుందా..? : కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ త‌న‌పై చేసిన ఆరోపణలపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. అనకాపల్లిలో త‌న‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి నాపై ఆరోపణ చేయడం మూర్ఖత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి నేను కాంట్రాక్ట్ పొందానన‌డం అవాస్తవం అన్నారు. అసలు ఆ కంపెనీకి, నాకు సంబంధం లేదన్నారు.

ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెలితో పోరు ఉన్నట్టే.. తెలంగాణలో నీకు కూడా చెల్లెలిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నావని కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఎల్ అండ్ టీ & రిత్విక్ కంపెనీలకు వర్క్ కాంట్రాక్ట్ వచ్చి మూడు నెలల అయ్యింది. ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా అని ప్ర‌శ్నించారు.

నాలుగు నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన నీవు.. ఏం మాట్లాడావో గుర్తుందా..? మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా.. కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే.. బీజేపీ పార్టీలో మీ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావు.. అవునా..? కాదా..? నేను మా పార్టీ పెద్దలతో చర్చించి మీది అవినీతి పార్టీ అని తెలంగాణలో మీ పని అయిపోయిందని.. కావున మీతో మాకు పని లేదని చెప్పడం వల్లే ఇటువంటి ఆరోపణ చేస్తున్నావ్ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచావో నన్ను చెప్పమంటావా.? అని అడిగారు. తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నిన్ను అడిగితే.. మా పార్టీకి కమ్మ నా కొడుకులు అవసరం లేదని.. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్లు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా? లేదా?

రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి టిడిపి పొత్తుతో పని చేస్తాయని.. అప్పుడు టిఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవని తెలిసే ఇటువంటి నిరాహార ఆరోపణలు చూస్తున్నావు.. మీ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు.? అవి ఎవరెవరికి ఇచ్చారు.? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది.? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నది నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి.. దమ్ముంటే రండి మీరు చెప్పిన చోటుకు వచ్చి మీడియా సమక్షంలో చర్చిద్దాం అని స‌వాల్ విసిరారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్రపరిణామాలుంటాయ‌ని హెచ్చ‌రించారు. అనవసరంగా నన్ను కెలికితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుందన్నారు.

Next Story