గుజ‌రాత్ మోడ‌ల్ అని చెప్పి మోసం చేశారు

CM KCR calls for ‘BJP mukt Bharat’, promises farmers government at Centre. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని

By Medi Samrat  Published on  29 Aug 2022 2:27 PM GMT
గుజ‌రాత్ మోడ‌ల్ అని చెప్పి మోసం చేశారు

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం నాడు ప్రకటించారు. విభజన శక్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు తొలిసారిగా 'బీజేపీ ముక్త్‌ భారత్‌'కు పిలుపునిచ్చారు. 'బీజేపీని తరిమికొట్టి కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని పెద్దపల్లి నుంచి ప్రకటిస్తున్నాను. త్వరలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాం'' అని ఆయన ప్రకటించడంతో జిల్లాలోని పెద్దకల్వలలో జరిగిన బహిరంగ సభలో ప్రజల నుంచి చప్పట్లు, హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. అంతకుముందు పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.

25 రాష్ట్రాల నుంచి 100 మంది రైతులు తనను కలిశారని, తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కనిపించడం లేదని ముఖ్యమంత్రి వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 'గోల్‌మాల్‌' సమాచార ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.

గుజరాత్ మోడల్ అంటూ ప్రధాని మోదీ, బీజేపీ ప్రజలను మోసం చేశాయని.. అయితే దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలేవీ గుజరాత్‌లో లేవని గుర్తు చేశారు.

ఢిల్లీ దొంగలు తెలంగాణలో పర్యటిస్తున్నారని, స్థానిక నాయకులు వారి బూట్లను (పాదరక్షలు) పట్టుకుని సంతోషంగా బానిసలుగా మారుతున్నారని చంద్రశేఖర్ రావు అన్నారు. 60 ఏళ్లుగా ఆత్మగౌరవం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ కొంత‌మంది ఢిల్లీ నాయ‌కుల ముందు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. మ‌నం దానిని అనుమతించాలా?" అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్న తరుణంలో అవినీతి, విభజన శక్తులు తెలంగాణలో మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పదే పదే విఫలమవుతున్న బీజేపీని తరిమికొట్టాలని ప్రజలను కోరారు.


Next Story