15 నుంచి జిల్లాల్లో కేసీఆర్ స‌భ‌లు.. నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్

ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  9 Oct 2023 12:19 PM GMT
15 నుంచి జిల్లాల్లో కేసీఆర్ స‌భ‌లు.. నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్

ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స‌మావేశ‌మ‌వ‌నున్నారు. ఈ స‌మావేశంలోనే బీ ఫామ్‌ను అభ్యర్థులకు అందజేయ‌డంతో పాటు.. పార్టీ మేనిఫెస్టో విడుదల చేయ‌నున్నారు. అక్టోబర్ 15, 16 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఇక నవంబర్ 9 న రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖ‌లు చేయ‌నున్నారు.

అక్టోబర్ 15న జ‌రుగ‌నున్న స‌మావేశంలో ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచనలు ఇవ్వ‌నున్నారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం అదేరోజు (అక్టోబర్ 15) న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 18 నాడు మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు.

నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో సీఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Next Story