ఓట్లు చీలాయి కాబట్టే, బీసీ అభ్యర్థి గెలవలేదు..గ్రాడ్యుయేట్స్ ఫలితాలపై కవిత వ్యాఖ్యలు
కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 March 2025 11:19 AM IST
ఓట్లు చీలాయి కాబట్టే, బీసీ అభ్యర్థి గెలవలేదు..గ్రాడ్యుయేట్స్ ఫలితాలపై కవిత వ్యాఖ్యలు
కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది. పార్టీలు గెలిచాయి..అని కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది. పార్టీలపరంగా, సిద్దాంతపరంగా ఓట్లు చీలాయి. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ కలవాలన్న నినాదాంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయి. కాబట్టి చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవి. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని..కవిత డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలి. అని కవిత అన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారు. రాష్ట్ర స్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తోంది. మూడు ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర చేస్తుంది. మూడు అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయ వివాదం తలెత్తుతుంది. జనభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.