తెలంగాణలో ఇప్పుడున్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాతో పాటు, జాగృతి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దూరదృష్టి వల్లే తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారని అటువంటి తల్లులకు ఉద్యమాభివందనాలు. అది మనం గుర్తు చేసుకోవాలి.అని కవిత పేర్కొన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండటం దారుణం. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం. ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది అమరవీరులకు జరుగుతున్న అన్యాయంగానే భావిస్తాం. అమరవీరులకు సీఎం నివాళులు అర్పించే వరకు జాగృతి తరఫున ప్రత్యేక కార్యాచరణ తీసుకుని పోరాటం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర వనరుల మీద జరుగుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతాం..అని కవిత వ్యాఖ్యానించారు.