బీజేపీలో చేరిన‌ బూర నర్సయ్య గౌడ్

Boora Narsaiah Goud joined BJP. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారం బీజేపీలో చేరారు.

By Medi Samrat  Published on  19 Oct 2022 10:11 AM GMT
బీజేపీలో చేరిన‌ బూర నర్సయ్య గౌడ్

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారం బీజేపీలో చేరారు. ఇటీవల పలువురు బీజేపీ నాయకులను కలుసుకుంటూ వెళ్లిన ఆయన ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన నర్సయ్య గౌడ్ బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిష్పక్షపాతంగా పనిచేయడమే తన ప్రధాన కర్తవ్యమని ఆయన చెప్పారు. తాను ఎంపీగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను భువనగిరికి తీసుకువచ్చానని చెప్పారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళతానని అన్నారు. కేంద్రమంత్రులు భూపేంద్రయాదవ్, కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, తదితరుల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బూర నర్సయ్యతో పాటు మరికొందరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు.


Next Story