ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం: టీపీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 3:18 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం: టీపీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కామారెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి అని అననారు. పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తుందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడం బీజేపీ పార్టీకి పరిపాటిగా మారిందని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఆ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
బీఆర్ఎస్ పదేళ్లలో 50 వేల ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నాం..అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వంతో చర్చించి పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తారు. విద్యావేత్తగా నరేందర్ రెడ్డికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలపై అవగాహన ఉంది.. బీజేపీ అభ్యర్థికి ఇక్కడి పట్టభద్రుల సమస్యలపై అవగాహన లేదు అని టీపీసీసీ చీఫ్ మాట్లాడారు.
బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, రాహుల్ గాంధీ ఆశయం మేరకు కులగణన సర్వే నిర్వహించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రాడ్యుయేట్ పరిధిలోని నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి.. బడ్జెట్లో రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండు సున్నా.. అని విమర్శించారు. బడ్జెట్లో రూపాయ తీసుకుని రాని బీజేపీ ఎంపీలను నిలదీయాలని ఆయన కోరారు.