కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ చలానాల రూపంలో సామాన్యులను దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. ఏడాది కాలంలోనే చలానాల వసూళ్లు రూ.108.33 కోట్ల నుండి రూ.275.05 కోట్లకు పెరగడంపై ఆయన మండిపడ్డారు. ఇది 'ప్రజా పాలన' కాదు, 'పెనాల్టీ పాలన' అని ధ్వజమెత్తారు.
చలానాలు 2.5 రెట్లు పెరిగినప్పుడు, రోడ్ల పరిస్థితి గానీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ గానీ అదే స్థాయిలో మెరుగుపడ్డాయా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలానాల కోసం నేరుగా బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు కట్ చేసే 'ఆటో-డెబిట్' విధానం గురించి మాట్లాడటం అన్యాయమని పేర్కొన్నారు. మొదట ఫైన్లు పెంచి, ఇప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు లాక్కోవడం చూస్తుంటే ఇది పాలనలా లేదు, 'ఆటోమేటెడ్ దోపిడీ'లా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్యుడు ఒక 'నడిచే ఏటీఎం'లా కనిపిస్తున్నాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.