ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి బీజేపీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో గెలవడానికి "ఫార్మాట్"లో మార్పును సూచించారు. దీంతో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత సమస్యలు బహిర్గతమయ్యాయి. ఇప్పటికే రాజా సింగ్ తెలంగాణ బీజేపీకి దూరమవ్వగా ఇప్పుడు రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు పాపులారిటీని సంపాదించుకున్నాయి.
తెలంగాణలో కూడా బిహార్ మాదిరి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని, కలిసిగట్టుగా పనిచేసి అధికారంలోకి తీసుకొద్దామని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. కొందరు బీజేపీ నేతలు టెస్టు మ్యాచులు ఆడుతున్నారని, అలాంటి వారు ఇకనైనా ఫార్మాట్ మార్చాలని సూచించారు. టెస్టు మ్యాచులు వద్దని, టీ20 మ్యాచులు ఆడుదామని చెప్పారు. రాష్ట్ర నేతలు తన సూచనలను మరోలా తీసుకోవద్దని సూచించారు.
రాష్ట్రంలోని ప్రస్తుత బీజేపీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ తర్వాత స్థానంలో రాకేష్ రెడ్డి ఉన్నారు. జూలైలో ఎన్ రాంచందర్ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేశారు.