కేటీఆర్పై మరో ఫిర్యాదు
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది.
By Medi Samrat Published on 8 Jan 2025 3:15 PM IST
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని యుగంధర్ గౌడ్ కోరారు. ప్రస్తుతం ఫార్ములా ఇ రేస్ కేసులో కేటీఆర్ చిక్కుకున్నారు. ఫార్ములా ఇ వ్యవహారంపై ఆయనను ఏసీబీ గురువారం విచారించనుంది.
ఫార్ములా-ఇ కేసు అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ.. ఏదో జరిగిపోయిందన్నట్టు కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారన్నారు. నా మీద పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు, ఏమీ లేని లొట్టపీసు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు వెళ్లానన్నారు. భారత పౌరుడిగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు నాకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటాని కేటీఆర్ తెలిపారు.