హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్తానీలు..వెనక్కి పంపాలని అమిత్ షా ఆదేశాలు

హైదరాబాద్‌లో కూడా 200 మందికి పైగా పాకిస్థానీలు ఉన్నారని కేంద్రం తెలిపింది.

By Knakam Karthik
Published on : 25 April 2025 2:25 PM IST

Telangana, Hyderabad News, Pahalgham Attack, Pakistanis, AmitShah Orders ,Visa Cancellation

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్తానీలు..వెనక్కి పంపాలని అమిత్ షా ఆదేశాలు

పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై కీలక చర్యలకు భారత ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందులో భాగంగానే వారి వీసాలను రద్దు చేసింది. తక్షణమే భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా 200 మందికి పైగా పాకిస్థానీలు ఉన్నారని కేంద్రం తెలిపింది. వారిని కూడా వెనక్కి పంపించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రహోంశాఖ అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రాలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు..కేంద్ర హోంశాఖ ఆదేశాలు పాకిస్తానీయులను వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టారు.

అమిత్ షా ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన వారిని త్వరగా వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంమంత్రి సూచించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నాటికి అన్ని వీసాలు రద్దవుతాయని కేంద్రం తెలిపింది.

Next Story