వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ మండలం ఇజ్రాచిట్టెంపల్లి సమీపంలో మోమిన్పేటలో ఆటో, లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలను ఎక్కించుకుని రోడ్డుపై వేచి ఉన్న ఆటోను లారీ, బస్సు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలిలోనే నలుగురు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా కూలీలుగా తెలుస్తోంది. వారిలో మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సు.. లారీని తప్పించబోతుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇక, ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.