వీడియో కాన్ఫరెన్స్లతో కోర్టు విచారణల మార్గదర్శకాలపై విచారణ
By అంజి Published on 6 April 2020 10:11 AM GMTఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్లతో కోర్టు విచారణల మార్గదర్శకాలపై సుప్రీంకోర్టులో సుమోటో కేసు విచారణ జరిగింది. లాక్డౌన్ వేళ కోర్టుల పనితీరుపై లేఖ ద్వారా సలహాలు, సూచనలతో న్యాయవాది వికాస్ సింగ్ పిటిషన్ వేశారు. వికాస్ సింగ్ సలహాలు, సూచనలు పరిశీలించాల్సిన అవసరం ఉందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుల విచారణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు సామాజిక దూరం పాటించేలా మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని సీజేఐ ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణపై హైకోర్టులకు అధికారం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. అన్ని కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ విచారణలో కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ విచారణల్లో ఏ సందర్భంలోనూ సాక్ష్యాలు నమోదు చేయొద్దని సూచించింది.
సాక్ష్యాలు నమోదు చేయాల్సి వస్తే కోర్టు రూమ్లో తీసుకోవడంపై ప్రిసైడింగ్ అధికారి నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టుల నిబంధనల ప్రకరాం జిల్లా కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరపాలని ఆదేశించింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ను ఏ అప్లికేషన్ ద్వారా జరపాలన్నది హైకోర్టులు ఇష్టమని సుప్రీంకోర్టు వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ల కనెక్టివిటీలో కోర్టులకు సహకారం అందించేలా ఎన్ఐసీ అధికారులకు కేటాయించాలని సుప్రీంకోర్టు కోరింది. సుమోటో కేసుపై తదుపరి విచారణ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వతా చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.