మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌నున్న యువరాజ్.. మ్యాచ్‌లు ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయంటే..?

భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి క్రికెట్ మైదానంలోకి రాబోతున్నాడు

By Medi Samrat  Published on  1 Feb 2025 2:49 PM IST
మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌నున్న యువరాజ్.. మ్యాచ్‌లు ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయంటే..?

భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి క్రికెట్ మైదానంలోకి రాబోతున్నాడు. సిక్సర్ కింగ్‌గా పేరుగాంచిన యువరాజ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో పాల్గొన‌నున్నాడు. యువరాజ్ ఇండియా మాస్టర్స్ జట్టుకు ఆడనున్నాడు. ఈ లీగ్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు జరగనుంది.

2007లో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదాడు. అప్పటి నుండి అతని పేరు సిక్సర్ కింగ్‌గా మారింది. ఆ ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. యువరాజ్ సింగ్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడంలోనూ యువరాజ్ కీలక పాత్ర పోషించాడు.

యువరాజ్ సింగ్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ జేపీ డుమినీ కూడా ఈ లీగ్‌లో పాల్గొననున్నాడు. అతను మాస్టర్స్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇది తనకు గర్వకారణమని డుమిని అన్నాడు. డుమిని దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అదేవిధంగా, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ ఉపుల్ తరంగ కూడా శ్రీలంక మాస్టర్స్ కోసం ఈ లీగ్‌లో ఆడనున్నాడు. ఈ లీగ్‌లో ఆడటం పట్ల తరంగ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ లీగ్‌లో చేరిన సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ.. "సచిన్ టెండూల్కర్, నా ఇతర సహచరులతో కలిసి ఈ లీగ్‌లో ఆడటం నా పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. వారందరితో ఆడటం చాలా జ్ఞాపకాలను తిరిగి తెస్తుందన్నాడు.

మాస్టర్ లీగ్ దేశంలోని మూడు నగరాల్లో జ‌రుగ‌నుంది. ఈ లీగ్ మ్యాచ్‌లు నవీ ముంబై, రాజ్‌కోట్, రాయ్‌పూర్‌లలో జరుగుతాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. ఇండియా మాస్టర్స్ జట్టులో సచిన్ టెండూల్కర్ కూడా ఆడ‌నున్నాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, ఇంగ్లండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ కూడా ఈ లీగ్‌లో పాల్గొంటారు.

Next Story