రిషబ్‌ పంత్‌ను టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియ‌మించ‌డానికి కార‌ణం ఇదే..!

భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా చేయడానికి కారణమేమిటో చెప్పాడు.

By Medi Samrat
Published on : 24 May 2025 5:36 PM IST

రిషబ్‌ పంత్‌ను టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియ‌మించ‌డానికి కార‌ణం ఇదే..!

భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా చేయడానికి కారణమేమిటో చెప్పాడు. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించగా.. అందులో శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

రిషబ్ పంత్ 2020 నుండి టెస్టు ఫార్మాట్‌లో భారత్ త‌రుపున‌ అత్యుత్తమ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. అతడు స్వదేశంలో, విదేశాలలో అనేక మ్యాచ్‌లను మార్చే ఇన్నింగ్స్‌లు ఆడాడు. పంత్ నియామకం గురించి మాట్లాడుతూ అగార్కర్.. అతని అద్భుతమైన రికార్డును హైలైట్ చేసాడు.. వికెట్ వెనుక నుండి ఆటను చదవడంలో అతనికి అవగాహన అద్భుతంగా ఉందని చెప్పాడు.

విలేకరుల సమావేశంలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. 'నా ఉద్దేశ్యం అతను వైస్ కెప్టెన్. గత నాలుగు-ఐదేళ్లలో టెస్టు క్రికెట్‌లో మన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో అతను ఒకడు. అతనికి దాదాపు 40 టెస్టుల అనుభవం ఉంది. వికెట్ కీపర్‌గా, వికెట్ వెనుక నుండి మ్యాచ్‌ను చ‌ద‌వ‌గ‌ల అత‌ని శ‌క్తి అద్భుతమైనది.. అతని అనుభవం విలువైనది. అతడు శుభ్‌మన్‌కు వైస్ కెప్టెన్‌గా ఉండటానికి కారణం ఇదే. పంత్‌ తన అనుభవంతో గిల్‌కు సహాయం చేస్తాడు. పంత్ గొప్ప ఆటగాడు. రాబోయే సంవత్సరాల్లో జట్టును ముందుకు తీసుకెళ్లగల ఆటగాళ్లపై మేము ఖచ్చితంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నాడు.

రిషబ్ పంత్ 43 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో అతను 42.11 సగటుతో 2,948 పరుగులు చేశాడు. పంత్ ఆరు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల పంత్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో సెంచరీలు సాధించాడు. 2021లో బ్రిస్బేన్‌లో 89* పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.

Next Story