భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత టీ20 జట్టు కెప్టెన్ గా తాను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను టీ20 కెప్టెన్ గా కొనసాగబోనని విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు.టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్గా కొనసాగుతానని స్పష్టం చేశాడు.
తన ట్విట్టర్ ఖాతాలో విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ ను ఉంచాడు. తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఇకపై కాస్త తగ్గించడానికి టీ20 కెప్టెన్ గా తప్పుకున్నానని తెలిపాడు. ఈ విషయం గురించి కోచ్ రవి శాస్త్రితోనూ, రోహిత్ శర్మతోనూ చర్చించానని కూడా కోహ్లీ తెలిపాడు. టీ20 వరల్డ్కప్ 2021 తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కేవలం టీ20 కెప్టెన్ గా మాత్రమే తాను తప్పుకుంటూ ఉన్నానని విరాట్ క్లారిటీ ఇచ్చాడు.