టాప్-5 లోకి దూసుకొచ్చిన కోహ్లీ

పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో లాభపడ్డాడు.

By Medi Samrat  Published on  26 Feb 2025 4:16 PM IST
టాప్-5 లోకి దూసుకొచ్చిన కోహ్లీ

పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో లాభపడ్డాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి మరోసారి టాప్-5కి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ను వెనక్కి నెట్టి కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు కోహ్లీ ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు.

కోహ్లి కొంతకాలంగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డాడు. కానీ ఆదివారం దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అతడు అజేయంగా 100 పరుగులు చేసి భారత జట్టు విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావడమే కాకుండా వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సెంచ‌రీ కార‌ణంగా బుధవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ లాభపడ్డాడు.

భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో బాబర్ ఆజం ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ సెంచరీ సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని ఘ‌నంగా ఆరంభించాడు. పాకిస్థాన్‌పై భారత వైస్ కెప్టెన్ గిల్ 46 పరుగులు చేశాడు. గిల్ ప్ర‌స్తుతం 817 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు. బాబర్ 770 పాయింట్లతో ఉన్నాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ముగ్గురు భార‌త‌ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై 90 బంతుల్లో 64 పరుగులు చేశాడు. భారత్‌పై దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన బాబ‌ర్‌ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లలో శ్రేయాస్ అయ్యర్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతుండగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Next Story