క‌ల నెర‌వేర‌లేదు.. బాధగా ఉంది.. కోహ్లీ భావోద్వేగం

Virat Kohli Gets Emotional After India's T20 World Cup 2022 Semi-Final Exit.టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా క‌థముగిసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2022 9:01 AM GMT
క‌ల నెర‌వేర‌లేదు.. బాధగా ఉంది.. కోహ్లీ భావోద్వేగం

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా క‌థ సెమీస్‌తో ముగిసింది. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెరదించుతార‌ని బావించగా మ‌రోసారి అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. గురువారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రోహిత్ సేన ఘోర ఓట‌మిని చ‌విచూసింది. ఇంటిదారి ప‌ట్టిన టీమ్ఇండియాపై అభిమానులు, మాజీలు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌ట్టును ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఈ టోర్నీలో త‌మ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ స్పందించాడు. మా క‌ల నెర‌వేర్చుకోకుండానే భార‌మైన హృద‌యంతో ఆస్ట్రేలియాను వీడుతున్నామంటూ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఈ టోర్నీ నుంచి నేర్చుకున్న పాఠాల‌తో మ‌రింత బ‌లంగా తిరిగివ‌స్తామన్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

'మా కలను సాకారం చేసుకోకుండానే ఆసీస్‌ను వీడాల్సి వస్తోంది. ఇందుకు మేము చాలా బాధపడుతున్నాం, అయితే ఎన్నో మరుపురాని జ్ణాపకాలను మా వెంట తీసుకువస్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. మాకు మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌తి ఒక్క అభిమానికి కృత‌జ్ఞ‌త‌లు. ఈ జెర్సీ ధరించి, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తాను' సోష‌ల్ మీడియాలో కోహ్లీ రాసుకొచ్చాడు.

ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడాడు. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలు బాదాడు. మొత్తం 296 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా బావోద్వేగానికి లోనైయ్యాడు. బాధాక‌ర‌మైన ఓట‌మి. ఎక్క‌డ ఆడినా అద్వితీయ మ‌ద్ద‌తు ఇచ్చే అభిమానుల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. మాకు అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికి, జ‌ట్టు యాజ‌మాన్యం, స‌హాయ సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు. నా దేశానికి ఆడ‌టం గ‌ర్వంగా ఉంది. మ‌రింత బ‌లంగా తిరిగొస్తాం అని సూర్య ట్వీట్ చేశాడు.





Next Story