భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2020–2021 సీజన్కు కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే..! 2019–2020 కాంట్రాక్ట్ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా, తాజా కాంట్రాక్ట్ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. మొత్తం 28 మంది ఆటగాళ్లు బీసీసీఐ కాంట్రాక్ట్ ను సొంతం చేసుకున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గ్రేడ్ 'ఎ ప్లస్'లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే రవీంద్ర జడేజాకు 'ఎ ప్లస్' ఇవ్వకపోవడం అవమానించడం లాంటిదేనని ఇంగ్లండ్ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ చెప్పుకొచ్చారు.
రవీంద్ర జడేజా చాలాకాలంగా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడని.. జడేజాను 'ఎ ప్లస్' గ్రేడ్లో తీసుకోవడానికి చర్చలు జరిపినా.. చివరకు అతనికి కేటాయించకపోవడాన్ని వాన్ తప్పుబట్టారు. ఒక కీలక ఆటగాడ్ని 'ఎ ప్లస్' కేటగిరీలో చేర్చలేదని.. వార్షిక కాంట్రాక్ట్ల్లో జడేజాకు సరైన స్థానం ఇవ్వకపోవడం నిజంగానే అవమానకరమన్నారు. భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లి తర్వాత జడేజానే 'ఎ+' కేటగిరీకి అన్ని విధాల అర్హుడని వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.