ఆ అండర్-19 ఆటగాడు ఏజ్ ఫ్రాడ్ చేశాడా..?
U19 World Cup Star Accused Of 'Age Fraud'. 2018లో భారతదేశం అండర్-19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత, మంజోత్ కల్రా అనే ఆటగాడు
By Medi Samrat
2018లో భారతదేశం అండర్-19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత, మంజోత్ కల్రా అనే ఆటగాడు ఏజ్ విజయంలో ఫ్రాడ్ చేసినట్లు తెలియగానే అతడిపై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. ఇప్పుడు మరో వివాదం భారత క్రికెట్ను తాకింది. మహారాష్ట్ర క్రీడల కమిషనర్ నుండి ఈ ఆరోపణలు వచ్చాయి. పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్పై వయసు విషయంలో మోసం చేశాడనే ఆరోపణలు రావడంతో బీసీసీఐకి ఫిర్యాదు అందింది. సామ్నా వార్తాపత్రికలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం మహారాష్ట్రలోని క్రీడలు, యువజన విభాగం కమిషనర్ ఓంప్రకాష్ బకోరియా, పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలతో పాటు వయస్సు విషయంలో చేసిన మోసంపై బీసీసీఐకి లేఖ రాశారు. రాజ్వర్ధన్ హంగర్గేకర్ అసలు వయస్సు 21 అని తెలిపారు. అతను ఎనిమిదో తరగతిలో చదివే సమయంలో, హంగర్గేకర్ పుట్టిన తేదీని జనవరి 10, 2001 నుండి నవంబర్ 10, 2002కి మార్చారు. ఈ మార్పు అతన్ని అండర్-19లో పాల్గొనడానికి అనుమతించింది. ఇటీవల జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి భారత్ ప్రపంచకప్ను గెలుచుకుంది.
హంగర్గేకర్ U-19 ప్రపంచ కప్లో ఆరు మ్యాచ్లు ఆడాడు. ఐదు వికెట్లు తీశాడు. అయితే అతని పేస్ అభిమానులు, క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. తన బౌలింగ్తో అందరినీ ఆకట్టుకున్న తర్వాత పేసర్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 మెగా వేలంలో తీసుకోడానికి కొన్ని ఫ్రాంఛైజీలు ముందుకు వచ్చాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఐదుసార్లు ట్రోఫీ విజేత ముంబై ఇండియన్స్తో సహా మూడు జట్లు అతనిని కొనుక్కోవాలని భావించాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అతనిని రూ. 1.5 కోట్ల బిడ్తో సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏజ్ ఫ్రాడ్ అంశం బయటకు రావడంతో చెన్నై అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే అతడు కొన్ని సంవత్సరాల పాటూ క్రికెట్ కు దూరమయ్యే అవకాశం ఉంది.