తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన సీఎం రేవంత్
క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన సీఎం రేవంత్
క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలన్న ఉద్దేశంతోనే ప్రైవేటు – పబ్లిక్ భాగస్వామ్యంతో క్రీడాపాలసీని రూపొందించామని తెలిపారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని ఆహ్వానించే ఒక బోర్డును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హెచ్ఐసీసీలో నిర్వహించిన 1st ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ – 2025 లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా విధానాన్ని ప్రకటించారు. దేశంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, ప్రముఖ క్రీడాకారులు, క్రీడాభిమానులు ఈ కాంక్లెవ్ లో పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... “రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ పాలసీ తెచ్చాం. ఒక రోజు సదస్సు నిర్వహించి వదిలేయడానికి కాదు. వచ్చే రోజుల్లో ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి, ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఈ వేదికలో పాల్గొన్న క్రీడాకారులంతా తెలంగాణ క్రీడా పాలసీలో భాగస్వాములే. క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలపాలి. ఇది కొత్త ఆరంభం. ఇందుకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. క్రీడాభివృద్ధికి ఎలాంటి మద్దతు కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందరం కలిసి ముందుకు సాగుదాం. తెలంగాణ పేరును ప్రపంచం ముందు నిలపడంలో అందరి మద్దతు ఉండాలి.
నగరాలు, పట్టణాల్లో క్రీడామైదానాలు లేక, క్రీడలను ప్రోత్సహించే పరిస్థితులు లేని కారణంగా కాలేజీలు, విద్యా సంస్థల్లో యువత పెడదారులు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా సరైన విధానాలు లేకపోవడం, క్రీడలను ప్రోత్సహించని కారణంగానే మాదక ద్రవ్యాలు వేగంగా విస్తరించే ప్రమాదం ఏర్పడుతోంది. మాదక ద్రవ్యాల వినియోగమే కాదు, అవి తెలంగాణలో అడుగు పెట్టాలంటే వణుకు పుట్టాలి. అందుకోసమే ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశాం.
1956 ఒలింపిక్స్ ఫుట్బాల్ క్రీడలో 9 మంది క్రీడాకారులు హైదరాబాద్ నుంచి పాల్గొన్న చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆ తర్వాత ఎందరో క్రీడాకారులు ఇక్కడి నుంచి రాణించారు. అలా రాణించిన వారికి ప్రభుత్వం ఇంటి స్థలాలు, నగదు ప్రోత్సహకాలు, ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చదువులోనే కాదు క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గడిచిన పది పదిహేను సంవత్సరాల కాలంలో క్రీడలకు ప్రోత్సహం లేక మైదానాలు ఫంక్షన్ హాళ్లుగా మారాయి.
ఇటీవలి ఒలింపిక్స్లో భారత్ 71 వ స్థానంలో ఉందంటే అందరూ ఆలోచించాలి. చిన్న దేశమైన దక్షిణ కొరియా 32 స్వర్ణ పతకాలు సాధిస్తే అందులో ఒక అమ్మాయి ఏకంగా 3 స్వర్ణాలు సాధించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి ఒక్క స్వర్ణం కూడా రాకపోవడం విచారకరం. 2036 ఒలింపిక్స్ నిర్వహించాలని దేశం ముందుకు వెళుతున్న నేపథ్యంలో కనీసం రెండు క్రీడలనైనా తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని కోరాం.
దేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దశలో క్రీడల్లో కూడా బలంగా నిలవాలి. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో క్రీడాభివృద్ధి లక్ష్యాల కోసం ప్రత్యేక చాప్టర్ పెట్టాం. ఆ లక్ష్య సాధన దిశగానే క్రీడల్లో మంచి ఫలితాలు సాధిస్తున్న వారందరినీ ఈ వేదికపైకి ఆహ్వానించాం. తెలంగాణలో #YoungIndiaSportsUniversity #SportsAcademy లను ప్రారంభిస్తున్నాం. ఇక్కడ శిక్షణ ఇచ్చే కోచ్ల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే అత్యుత్తమ శిక్షణ కోసం దక్షిణ కొరియా యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం...” అని వివరించారు.
ఈ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ క్రీడాభివృద్ధికి సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ సందర్భంగా ప్రోత్సాహకంగా ప్రభుత్వం నగదు బహుమతులను అందజేసింది. కొరియాలో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2025 లో స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్ అగసర నందినికి రూ.5 లక్షలు, బెల్జియం లో జరిగిన 14 వ అంతర్జాతీయ జిమ్నోవా కప్ 2024 లో కాంస్య పతకం సాధించిన నిశికా అగర్వాల్కు 3 లక్షలు, 2024 జర్మనీలో జరిగిన ప్రపంచ (మూగ) షూటింగ్ చాంపియన్ షిప్లో 2 స్వర్ణాలు సాధించిన షూటర్ ధనుష్ శ్రీకాంత్కు 10 లక్షలు, ఈజిప్ట్లో వచ్చే సెప్టెంబర్ లో జరగబోయే గోల్ బాల్ అథ్లెటిక్స్లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్, పి. సాయి తేజ, కోచ్ శివకుమార్లకు 4.8 లక్షల రూపాయలను క్రీడా ప్రోత్సహాకం కింద అందజేశారు.