వ‌న్డే సిరీస్‌ను ఓట‌మితో మొద‌లెట్టిన భార‌త్‌

South Africa beat India by 31 runs in first one-day international.టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న టీమ్ఇండియా ఇప్పుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2022 2:55 AM GMT
వ‌న్డే సిరీస్‌ను ఓట‌మితో మొద‌లెట్టిన భార‌త్‌

టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న టీమ్ఇండియా ఇప్పుడు వ‌న్డే సిరీస్‌ను ఓట‌మితో మొద‌లుపెట్టింది. పార్ల్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమ్ఇండియాపై ద‌క్షిణాఫ్రికా 31 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. టాస్‌గెలిచిన ద‌క్షిణాప్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. వాండ‌ర్ డ‌సెన్‌(129 నాటౌట్; 96 బంతుల్లో 9 పోర్లు, 4 సిక్స‌ర్లు), బ‌వుమా(110; 143 బంతుల్లో 8 పోర్లు) శ‌త‌కాల‌తో రాణించ‌డంతో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 296 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్లో బుమ్రా 2 వికెట్లు తీయ‌గా.. అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంతరం 297 పరుగుల విజయలక్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. భార‌త బాట్స్‌మెన్ల‌లో ధావన్ (79; 84 బంతుల్లో 10పోర్లు), కోహ్లీ (51; 63 బంతుల్లో 3పోర్లు), శార్దూల్ ఠాకూర్ (50; 43 బంతుల్లో 5పోర్లు, 1సిక్స్‌) లు రాణించగా.. రిషభ్ పంత్ (16), శ్రేయస్ అయ్యర్ (17), వెంకటేశ్ అయ్యర్ (2), అశ్విన్ (7) విఫ‌లం అయ్యారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లో ఎంగిడి, షంసి, ఫెలుక్వాయో త‌లా రెండు వికెట్ల‌ను ప‌డ‌గొట్టారు. కీల‌క ఇన్నింగ్స్ ఆడిన వాండ‌ర్ డ‌సెన్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు ల‌భించింది. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య ఇదే వేదిక‌పై రేపు(శుక్ర‌వారం) రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది.

Next Story