దుమారం రేపిన గంగూలీ ట్వీట్..!
Sourav Ganguly to begin a new chapter. భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.
By Medi Samrat Published on 1 Jun 2022 8:45 PM IST
భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. బీసీసీఐ చీఫ్ పదవికి రాజీనామా చేసి గంగూలీ బీజేపీలో చేరతారంటూ పుకార్లు జోరందుకున్నాయి. క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అయ్యిందని పేర్కొంటూ, ఈ సుదీర్ఘ కెరీర్లో తనకు మద్దతుగా నిలిచిన వారికి గంగూలీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మరింత మంది ప్రజలకు సేవ చేసే దిశగా త్వరలోనే ఓ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నానని కూడా ఆయన పోస్ట్ చేశారు.
— Sourav Ganguly (@SGanguly99) June 1, 2022
'1992లో నేను నా క్రీడా జీవితాన్ని ప్రారంభించాను. 2022 నాటికి 30 ఏళ్లు గడిచాయి. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి ఆదరాభిమానాలు పొందగలిగాను. నా ఈ జర్నీలో భాగమైన అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పదలుకున్నా. ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండేందుకు నా వెన్నుతట్టి, నాకు అండగా నిలిచిన, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎక్కువ మంది ప్రజలకు సాయపడేలా ఇకపై కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తున్నా. ఈ కొత్త ప్రయాణంలో మీరు నాకు ఇలాగే మద్దతు ఇస్తారని భావిస్తున్నా..' అని సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ కారణంగా ఇప్పుడు గంగూలీ పాలిటిక్స్ లోకి వెళ్ళబోతున్నారంటే ప్రచారం సాగుతోంది. బీజేపీ వైపే గంగూలీ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.