'నేను ప్రశాంతంగా ఉన్నానంటే మౌనంగా ఉన్న‌ట్లు కాదు..'

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌ల‌ వివాహం క్యాన్సిల్ అయింది.

By -  Medi Samrat
Published on : 9 Dec 2025 4:16 PM IST

నేను ప్రశాంతంగా ఉన్నానంటే మౌనంగా ఉన్న‌ట్లు కాదు..

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌ల‌ వివాహం క్యాన్సిల్ అయింది. డిసెంబర్ 7న స్మృతి వివాహాన్ని రద్దు అయిన‌ట్లు ప్రకటించింది. ఈ క్ర‌మంలోనే గోప్యతకై స‌హ‌క‌రించాల‌ని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

వివాహం విచ్ఛిన్నమైన తర్వాత స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. అయితే అది మొబైల్ ఫోన్ ప్రకటన కావ‌డం విశేషం. అందులో తన క్యాప్షన్‌లో.. నేను ప్రశాంతంగా ఉన్నాను అంటే మౌనంగా ఉన్న‌ట్లు కాదు.. నియంత్రణతో ఉన్న‌ట్లు అని పేర్కొంది. అభిమానులు ఆమె వ్యక్తిగత జీవితంతో కనెక్ట్ అవడంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది.

స్మృతి మంధాన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె చేతిలో బ్యాట్ పట్టుకుని మాట్లాడుతుంది. నిశబ్దంలో ఉండే వ్యక్తులు సందడిని తట్టుకోలేరని.. అయితే నేను శబ్దం మధ్య కూడా ఊపిరి పీల్చుకోవడం నేర్చుకున్నానని స్మృతి వీడియో ప్రారంభంలో చెప్పింది. ఇప్పుడు శాంతి నా స్వరం.. నా విశ్వాసం.. నా నిజమైన బలం అని పేర్కొంది. ఇది ఆమె షేర్ చేసిన OnePlus 150R మొబైల్ ఫోన్ ప్రకటనకు సంబంధించిన వీడియో.

సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన వివాహం 23 నవంబర్ 2025న జరగాల్సి ఉంది, అయితే అదే రోజున స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో పలాష్ చాట్ మెసేజ్‌లు మిస్టరీ గర్ల్ ద్వారా లీక్ చేయబడ్డాయి. దీని తర్వాత పుకార్లు తీవ్రమయ్యాయి.

దీంతో ఆదివారం స్మృతి వివాహం రద్దు చేయబడిందని తెలియజేసింది. పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలి అని స్మృతి తెలిపింది. ఈ విషయం ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నాను. తాను ఇప్పుడూ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్న వ్యక్తినని, అయితే నానాటికీ పెరుగుతున్న పుకార్లు తనను తాను ముందుకు వచ్చేలా చేశాయని ఆమె రాసింది.

దయచేసి రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని.. ముందుకు సాగడానికి మాకు అవ‌కాశం ఇవ్వాలని స్మృతి సమాజానికి.. అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

Next Story