రంజీ పునరాగమనాన్ని పీడకలగా మార్చుకున్న‌ శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్ రంజీ ట్రోఫీ పునరాగమనం ఒక పీడకలగా మారింది. కేవలం 8 బంతులు మాత్ర‌మే ఆడి 3 పరుగులు మాత్ర‌మే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు

By Medi Samrat  Published on  3 March 2024 8:48 AM GMT
రంజీ పునరాగమనాన్ని పీడకలగా మార్చుకున్న‌ శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్ రంజీ ట్రోఫీ పునరాగమనం ఒక పీడకలగా మారింది. కేవలం 8 బంతులు మాత్ర‌మే ఆడి 3 పరుగులు మాత్ర‌మే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కొంతకాలంగా వివాదాలు చుట్టుముట్టిన నేప‌థ్యంలో శ్రేయాస్ అయ్యర్.. సందీప్ వారియర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఇటీవ‌ల శ్రేయాస్ అయ్యర్ BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దీంతో రంజీ మ్యాచ్ ఆడేందుకు శ్రేయాస్ సిద్ధ‌మ‌య్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో అయ్యర్ భారత జట్టులో భాగంగా ఉన్నాడు.. కానీ పేలవమైన ప్రదర్శన కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే.. అయ్యర్ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్లు కూడా తెలుస్తుంది. అతని గాయం గురించి BCCI ఎటువంటి అప్‌డేట్ ఇవ్వక‌పోవ‌డం విశేషం. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్‌కు విశ్రాంతినిచ్చి ఉంటే బీసీసీఐ వైద్య బృందం ఆ విషయాన్ని తెలియజేసి ఉండేది. ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అతడికి టీమ్‌ నుంచి ఉద్వాస‌న ప‌లికిన‌ట్లు తెలుస్తుంది.

ఇక రంజీ మ్యాచ్ విష‌యానికొస్తే శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చేసరికి ముంబై జట్టు 91/4 స్కోరు వద్ద ఉంది. అయ్యర్‌ను వారియర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ముంబై స్కోరు 96/5గ‌ఆ ఉంది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగుల స్కోరుకు ప్రతిస్పందనగా.. ముంబై రెండో రోజు లంచ్ వరకు 51 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. హార్దిక్ తమోర్ (8*), శార్దూల్ ఠాకూర్ (8*) పరుగులతో ఆడుతున్నారు.

ముంబైకి అతిపెద్ద తలనొప్పిగా తమిళనాడు కెప్టెన్ ఆర్ సాయి కిషోర్ మారాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు ఐదు వికెట్లు తీసుకున్నాడు. తన 20 ఓవర్లలో 7 మెయిడిన్లు సహా 31 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. ముంబై జట్టు ప్రస్తుతం తమిళనాడు స్కోరు కంటే 25 పరుగులు వెనుకబడి ఉంది. మూడు వికెట్లు మ‌త్ర‌మే మిగిలివున్నాయి.

Next Story