ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.. అందుకే ఇప్పుడు ఎన్‌సీఏలో ఉన్నా..

Rohit Sharma Breaks Silence On Controversy. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) అనంత‌రం భార‌త ఆట‌గాళ్లు నేరుగా ఆసీస్

By Medi Samrat  Published on  21 Nov 2020 2:08 PM GMT
ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.. అందుకే ఇప్పుడు ఎన్‌సీఏలో ఉన్నా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) అనంత‌రం భార‌త ఆట‌గాళ్లు నేరుగా ఆసీస్ ప‌ర్య‌ట‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ మాత్రం ఆసీస్ వెళ్ల‌కుండా స్వ‌దేశం చేరుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌కు జ‌ట్టును ఎంపిక చేయ‌గా.. మొద‌ట‌గా హిట్‌మ్యాన్‌కు చోటు ద‌క్క‌లేదు. త‌రువాత విమ‌ర్శ‌లు రావ‌డంతో.. టెస్టు సిరీస్‌కు అత‌డిని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు మాత్ర‌మే ఆడి విరాట్ స్వ‌దేశం రానుండ‌గా.. మిగ‌తా టెస్టుల్లో రోహిత్ కీల‌కం కానున్నాడ‌ని ప‌లువురు మాజీలు విశ్లేషిస్తున్నారు.

ఆసీస్ ప‌ర్య‌ట‌న కంటే ఎక్కువ‌గా.. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతుంది. ఐపీఎల్‌లో తొడ కండ‌రాల గాయంతో లీగ్ ద‌శ‌లో కొన్ని మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్ ఆ త‌రువాత ప్లేఆప్స్, ఫైన‌ల్ లో జ‌ట్టును ముందుండి న‌డిపించి ఐదోసారి ముంబై ఇండియ‌న్స్‌కు టైటిల్ అందించాడు. తాజాగా పీటీఐతో రోహిత్ మాట్లాడుతూ.. తొడ‌కండ‌రాల గాయం నుంచి కోలుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాన‌ని పేర్కొన్నాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు త‌న‌లో ఎలాంటి లోపాలు లేవ‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేయాల‌నే ఉద్దేశంతోనే బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్ అకాడ‌మీలో ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

అసలేం జరుగుతుందనే విషయంపై తనకు స్పష్టత లేదని, ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదన్నాడు. "అయితే నేను ఓ విష‌యం చెప్ప‌ద‌లుచుకున్నా. నేను నిరంతరం బీసీసీఐ, ముంబై ఇండియన్స్‌తో చర్చలు జరుపుతున్నా. లీగ్‌ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెడతానని మా జట్టుకు చెప్పాను. ఆ విషయంలో స్పష్టత వచ్చాక పరుగులు చేయడంపై దృష్టి సారించాను. ఇప్పుడిప్పుడే మరింత ఫిట్‌నెస్‌ సాధిస్తున్నా. టెస్టు సిరీస్‌ ఆడకముందే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాననే నమ్మకం కలగాలి. ఎందుకంటే.. ఏ విషయంలోనూ నన్ను వేలెత్తి చూపొద్దని అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఎన్‌సీఏలో ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేం అనుకున్నా పట్టించుకోను. 25 రోజుల పాటు పూర్తిస్థాయిలో కోలుకొని టెస్టు సిరీస్‌కు సిద్ధమవ్వాలనుకుంటున్నా. విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదు"అని రోహిత్ చెప్పాడు.

ముంబై ఇండియన్స్ జ‌ట్టు రాత్రికి రాత్రే విజయవంతమైన జట్టు కాలేదన్నాడు. దానికంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు. జ‌ట్టు యాజ‌మాన్యం త‌మ‌ని న‌మ్మింద‌ని, దాంతో ఒక బ‌ల‌మైన జ‌ట్టును నిర్మించామ‌ని చెప్పాడు. ఈ సీజన్‌లో అందరూ బాగా ఆడారు. సమిష్టి కృషి వల్లే టైటిల్ సాధించాం. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ట్రెంట్ ‌బౌల్ట్ జట్టులో ఉండడం మా అదృష్టం. అతడు గతేడాది ఢిల్లీ తరఫున ఆడాడు. 2020 వేలంలో ఆ ఢిల్లీ వదిలేయడంతో మేం కొనుగోలు చేశాం. అతడి ఎంపిక పట్ల గర్వంగా ఉన్నా' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.


Next Story