ఆసియా కప్.. భారత్ కు ఊహించని ఎదురుదెబ్బ
Ravindra Jadeja Ruled Out With Injury. ఆసియా కప్ లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్
By Medi Samrat
ఆసియా కప్ లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు జడేజా. అతడు కుడి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు జడేజా అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడని.. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ను జట్టులోకి ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది.
ఆసియా కప్ టోర్నీలో టీమిండియా స్టాండ్ బై ఆటగాళ్లలో అక్షర్ పటేల్ కూడా ఒకడు. "ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను ఎంపిక చేసింది. రవీంద్ర జడేజా కుడి మోకాలి గాయంతో టోర్నీ నుండి వైదొలిగాడు. అతను ప్రస్తుతం BCCI వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ను ముందుగా జట్టులో స్టాండ్బైస్లో ఒకరిగా ఎంపిక చేశారు. త్వరలో దుబాయ్లో జట్టులో చేరనున్నారు" అని BCCI ఒక ప్రకటనలో తెలిపింది.
ఆసియా కప్ లో రెండు వరుస విజయాలతో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశ చేరుకుంది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను సెప్టెంబరు 4న ఆడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ తో తలపడే ప్రత్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఈరోజు హాంగ్ కాంగ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఆ రెండు జట్లలో గెలిచిన జట్టుతో ఈ ఆదివారం భారత్ తలపడనుంది.