ఓ వైపు శ‌త‌కాలు, డ‌బుల్ సెంచ‌రీల‌ మోత‌.. మ‌రోవైపు బౌలర్ల విధ్వంసం..!

ఈ రంజీ ట్రోఫీ సీజన్ ఘ‌నంగా ప్రారంభ‌మైంది. సీనియర్ ఆటగాళ్లతో స‌హా యువ ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు.

By -  Medi Samrat
Published on : 16 Oct 2025 8:20 PM IST

ఓ వైపు శ‌త‌కాలు, డ‌బుల్ సెంచ‌రీల‌ మోత‌.. మ‌రోవైపు బౌలర్ల విధ్వంసం..!

ఈ రంజీ ట్రోఫీ సీజన్ ఘ‌నంగా ప్రారంభ‌మైంది. సీనియర్ ఆటగాళ్లతో స‌హా యువ ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి తొలి రౌండ్ ప్రారంభం కాగా.. తొలిరోజు మొత్తం ఏడు సెంచరీలు నమోదు కాగా, రెండో రోజు ఆరు సెంచరీలు నమోదయ్యాయి. అదే సమయంలో 5 డబుల్ సెంచరీలు కూడా న‌మోద‌య్యాయి. తొలిరోజు సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ రెండో రోజు డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. 173 పరుగుల వద్ద అతను ఔటయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అమన్ కూడా డబుల్ సెంచరీని కోల్పోయాడు. 183 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ సెంచరీ సాధించాడు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ రజత్ పాటిదార్, గుజరాత్‌కు చెందిన సిబ్శంకర్ రాయ్, హర్యానాలోని పార్ధ్‌ వాట్స్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పరాస్ డోగ్రా, రాజస్థాన్‌కు చెందిన దీపక్ హుడా, ఆంధ్రాకు చెందిన షేక్ రషీద్ తమ తమ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఐదు డబుల్ సెంచరీలు కూడా నమోదయ్యాయి. గోవాకు చెందిన అభివన్ తేజరానా, లలిత్ యాదవ్ డబుల్ సెంచరీలు చేశారు. ఢిల్లీ తరఫున సనత్ సాంగ్వాన్, ఆయుష్ దోసెజా తమ డబుల్ సెంచరీలను పూర్తి చేశారు. బీహార్ ఆటగాడు ఆయుష్ లోహరుక తన దేశవాళీ క్రికెట్ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు.

బౌలింగ్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విషు కశ్యప్, పుదుచ్చేరికి చెందిన సాగర్ ఉదేశి చెరో 7 వికెట్లు తీశారు. కాగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన యుధ్వీర్ సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. చాలా మంది యువ బౌలర్లు కూడా తమ ప్రభావాన్ని వదిలిపెట్టారు.

Next Story