Rahul Dravid Will Be Coach Of Team India In Sri Lanka. శ్రీలంకలో పర్యటించనున్న భారత జట్టుకు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్ గా
By Medi Samrat Published on 15 Jun 2021 11:11 AM GMT
శ్రీలంకలో పర్యటించనున్న భారత జట్టుకు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించాడు. జులైలో జరగనున్న ఈ సిరీస్కు బీసీసీఐ ఇటీవలే టీమ్ ను కూడా ప్రకటించింది. అయితే.. ఆ జట్టుకు ద్రావిడ్ కోచ్గా ఉంటారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిర్ధారిస్తూ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తాడని గంగూలీ ఓ వార్తా సంస్థతో వ్యాఖ్యానించాడు.
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టెస్ట్ టీమ్ కు కోచ్ లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో శ్రీలంకతో తలపడే టీమ్ కు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. జూన్ 14నుంచి వారం పాటు జట్టు సభ్యులను కఠినమైన క్వారంటైన్ లో ఉంచినట్టు తెలిపారు.
ఇదిలావుంటే.. జులై 13 నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం.. ఈ నెల 28న టీమిండియా ఆటగాళ్లు కొలంబో వెళ్లనున్నారు. అక్కడ జులై 4 వరకు మరోమారు క్వారంటైన్ లో ఉంటారు. తర్వాత జులై 13 నుండి 18 వరకు మూడు వన్డే మ్యాచ్ లు.. 21 నుండి 25వ తేదీ వరకు మూడు టీ20 మ్యాచ్ లలో పాల్గొంటారు.