పృథ్వీ షా తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వ్యక్తులతో తాను స్నేహం చేశానని ఒప్పుకున్నాడు. ఒకానొక దశలో క్రికెట్కు తక్కువ సమయం కేటాయిస్తున్నానని అర్థమైందని అన్నారు. 2023 వరకు రోజులో సగం సమయం గ్రౌండ్లోనే గడిపేవాడినని, ఆ తర్వాత నుంచి కొన్ని చెత్త విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టానని తెలిపాడు. తాతయ్య మరణం తర్వాత జీవితంలో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయని, కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయన్నాడు.
షా చివరిసారిగా ముంబై తరపున మధ్యప్రదేశ్తో జరిగిన ప్రీమియర్ దేశీయ టోర్నమెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ T20 ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఆ మ్యాచ్లో అతని జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తన పోరాట కాలంలో ఏ 'పెద్ద క్రికెటర్' కూడా తనను సంప్రదించలేదని షా వెల్లడించాడు. రిషబ్ పంత్ తనకు కాల్ చేశాడని తెలిపాడు.
గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలోనూ షాను తీసుకునేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. అయితే, ఆ తర్వాత దేశవాళీల్లో రాణించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఇటీవలే రంజీ ట్రోఫీలో ముంబయి జట్టును వీడాడు.