పాకిస్థాన్కు ఛాంపియన్స్ ట్రోఫీ ఊహించని షాక్ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలోనే దారుణమైన ప్రదర్శనతో పాకిస్థాన్ వైదొలగగా, టీమ్ఇండియా టైటిల్ గెలుచుకోవడం ఇంకా బాధల్లోకి నెట్టింది. ఈ టోర్నీ నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆతిథ్య దేశం అయినప్పటికీ పాకిస్థాన్ స్వదేశంలో ఆడింది ఒకే ఒక్క మ్యాచ్. లాహోర్లో ఆడిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై ఓటమి పాలైంది. ఆ తర్వాత దుబాయ్ వేదికగా భారత్తో ఆడిన మ్యాచ్లోనూ ఓడింది. ఇక బంగ్లాదేశ్తో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ 18 బిలియన్ పాకిస్థాన్ రూపాయలను ఖర్చు చేసినట్లు ఓ మీడియా నివేదిక పేర్కొంది. రావల్ఫిండి, లాహోర్, కరాచీ స్టేడియాల ఆధునికీకరణ కోసం ఈ నిధులను వెచ్చించింది. అంచనా వేసిన బడ్జెట్ కంటే 50 శాతం ఎక్కువ. దీంతో పాటు ఈవెంట్ సన్నాహాల కోసం 40 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. టికెట్ అమ్మకాలు, స్పాన్సర్షిఫ్ల ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డు 85 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం తమ లక్ అని మొదట్లో భావించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆ తర్వాత ఏ మాత్రం కలిసిరాక దారుణంగా నష్టపోయింది.