పారిస్ ఒలింపిక్స్.. భార‌త్ నుంచి బ‌రిలో 117 మంది..!

పారిస్ ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఏడు రిజర్వ్ ఆట‌గాళ్ల‌తో సహా 117 మంది అథ్లెట్లను చేర్చినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) బుధవారం ధృవీకరించింది

By Medi Samrat  Published on  18 July 2024 10:54 AM GMT
పారిస్ ఒలింపిక్స్.. భార‌త్ నుంచి బ‌రిలో 117 మంది..!

పారిస్ ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఏడు రిజర్వ్ ఆట‌గాళ్ల‌తో సహా 117 మంది అథ్లెట్లను చేర్చినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) బుధవారం ధృవీకరించింది. క్రీడా మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. రాబోయే ఒలింపిక్స్ కోసం 140 మంది సహాయక సిబ్బంది.. అధికారులు కూడా భారత బృందంతో పాటు ఉంటారు.

షాట్‌పుట్‌ ​​అథ్లెట్‌ అభా ఖతువా పేరును లిస్టులో చేర్చలేదు. ప్రపంచ ర్యాంకింగ్ ద్వారా కోటా సాధించిన అభా ఖతువా పేరును తొలగించడంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రితం.. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రపంచ అథ్లెటిక్స్ ఆటగాళ్ల జాబితా నుండి అతని పేరు తొలగించబడింది.

అథ్లెటిక్స్‌లో భారత్ అతిపెద్ద బృందాన్ని పారిస్ ఒలింపిక్స్‌కు పంపనుంది. 11 మంది మహిళలు, 18 మంది పురుషులు మొత్తం 29 మంది భారతీయ అథ్లెట్లు పతకాల వేట‌కై పారిస్ బ‌య‌లుదేరారు. వీరే కాకుండా షూటింగ్‌లో 21 మంది.. హాకీలో 19 మంది క్రీడాకారులు పారిస్ వెళ్ల‌నున్నారు. టేబుల్ టెన్నిస్‌లో ఎనిమిది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. బ్యాడ్మింటన్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధుతో సహా ఏడుగురు క్రీడాకారులు పాల్గొంటారు.

వీరితో పాటు ఆరుగురు రెజ్లింగ్, ఆరుగురు ఆర్చరీ, ఆరుగురు బాక్సింగ్ క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటారు. అదే సమయంలో గోల్ఫ్ నుండి నలుగురు, టెన్నిస్ నుండి ముగ్గురు, స్విమ్మింగ్‌ నుండి ఇద్దరు, సెయిలింగ్ మరియు గుర్రపు స్వారీ నుండి ఇద్దరు, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ కు సంబంధించిన క్రీడాకారులు పారిస్ వెళ్ల‌నున్నారు. భారతదేశం టోక్యో ఒలింపిక్స్‌కు 119 మంది సభ్యుల బృందాన్ని పంప‌నుంది. గ‌తంలో భార‌త్‌ ఒక స్వర్ణంతో సహా ఏడు పతకాలను గెలుచుకుంది. ఇది ఒలింపిక్స్‌లో భారతదేశం యొక్క అత్యుత్తమ ప్రదర్శన.

Next Story