భారత్‌కు భారీ షాక్‌.. స్వర్ణ పతక విజేత‌పై 18 నెలల నిషేధం

పారిస్‌లో ఒలింపిక్ క్రీడలు ముగిసిన నేప‌థ్యంలో పారాలింపిక్ క్రీడలు ప్రారంభమవనున్నాయి.

By -  Medi Samrat
Published on : 13 Aug 2024 6:26 PM IST

భారత్‌కు భారీ షాక్‌.. స్వర్ణ పతక విజేత‌పై 18 నెలల నిషేధం

పారిస్‌లో ఒలింపిక్ క్రీడలు ముగిసిన నేప‌థ్యంలో పారాలింపిక్ క్రీడలు ప్రారంభమవనున్నాయి. అంతకు ముందే భారత్‌కు పెద్ద షాక్‌ తగిలింది. గోల్డ్ మెడలిస్ట్ ప్లేయర్ ప్రమోద్ భగత్ పై నిషేధం వేటు పడింది. భగత్ టోక్యో పారాలింపిక్స్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. ఈసారి కూడా ప్రమోద్ స్వర్ణ పతకానికి గ‌ట్టి పోటీదారుగా ఉన్నాడు. అయితే అనూహ్యంగా అతనిపై నిషేధం విధించబడింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రమోద్ భగత్‌పై నిషేధం విధించింది.

యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రమోద్ భగత్‌ను 18 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తెలిపింది. సస్పెన్షన్ కారణంగా అతడు పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనలేడు. BWF తన ప్రకటనలో “మార్చి 1, 2024 న, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) యాంటీ డోపింగ్ విభాగంకు 12 నెలల్లో మూడుసార్లు అతని ఆచూకీ గురించి సమాచారాన్ని అందించడంలో విఫలమైనందుకు BWF డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది.

భగత్ ఈ నిర్ణయాన్ని CAS అప్పీల్ విభాగానికి అప్పీల్ చేశాడు. 29 జూలై 2024న CAS అప్పీల్ విభాగం భగత్ యొక్క అప్పీల్‌ను తిరస్కరించింది. 1 మార్చి 2024 నాటి CAS డోపింగ్ నిరోధక విభాగం నిర్ణయాన్ని ధృవీకరించిందని BWF ధృవీకరించింది. టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్‌3 విభాగంలో భ‌గ‌త్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌ను భ‌గ‌త్‌ ఓడించాడు. 35 ఏళ్ల భగత్ టోక్యో పారాలింపిక్ ఫైనల్‌లో సుమారు గంటా 40 నిమిషాల పాటు సాగిన కఠినమైన మ్యాచ్‌లో 14-21, 21-15, 21-15తో తన ప్రత్యర్థిపై విజయం సాధించాడు.

Next Story