టీమిండియా పాక్‌తో ఆ మ్యాచ్ ఆడకూడదు.. ఆడవలసి వస్తే ప్రతి గేమ్ ఆడాలి : మాజీ కెప్టెన్

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న ఆసియా కప్ మ్యాచ్ పట్ల భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశాడు

By Medi Samrat
Published on : 29 July 2025 3:24 PM IST

టీమిండియా పాక్‌తో ఆ మ్యాచ్ ఆడకూడదు.. ఆడవలసి వస్తే ప్రతి గేమ్ ఆడాలి : మాజీ కెప్టెన్

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న ఆసియా కప్ మ్యాచ్ పట్ల భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ చేప‌ట్టిన‌ ఆపరేషన్ సింధూర్ సహా భారత్‌-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలను అజార్ ఉదహరించారు.

ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు UAEలో నిర్వహించనున్నారు. యూఏఈ, ఒమన్‌లతో పాటు భారత్‌, పాకిస్థాన్‌లు గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకున్నాయి. ఐఏఎన్‌ఎస్‌తో అజారుద్దీన్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీమిండియా ఈ మ్యాచ్ ఆడకూడదు. మనం ఏమి ఎదుర్కొంటున్నామో అందరికీ తెలుసు అన్నారు. మ‌నం ఆడవలసి వస్తే ప్రతి గేమ్ ఆడాలి. ఏ ఆట ఆడాలి, ఏది ఆడకూడదో మనం ఎంచుకోకూడదు. ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలని, తుది నిర్ణయం ఉన్నతాధికారులే తీసుకుంటారని కూడా అజహర్ చెప్పారు. 'చివరకు ఆడాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బోర్డు నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం, బీసీసీఐ నిర్ణయం చెల్లుబాటు అవుతుంది. సమస్య పరిష్కారమయ్యే వరకు ముందుకు సాగకూడదు. మేము ఏమి చెప్పినా మాములే.. ప్రభుత్వం, బీసీసీఐ ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఈరోజు మేం ఏది మాట్లాడినా మా ఆలోచన‌లు మాత్ర‌మేన‌న్నారు.

ఆసియా కప్ T20 ఫార్మాట్ ప్రకారం జ‌రుగుతుంది. ఇందులో మొత్తం 19 మ్యాచ్‌లు ఉన్నాయి. మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబిలో జరుగుతాయి. BCCI టోర్నీ అధికారిక హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. 2027 వరకూ ఒకరి గడ్డపై మరొకరు ఆడకూడదని భారత్‌-పాకిస్థాన్‌లు అంగీకరించాయి. అందువల్ల UAEని తటస్థ ప్రదేశంగా ఎంచుకున్నారు.

సెప్టెంబరు 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్‌లో భారత జట్టు టోర్నీని ప్రారంభించ‌నుంది. లీగ్ దశ తర్వాత సెప్టెంబర్ 21న సూపర్-4 దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉంటుంది. అయితే.. భారత్‌, పాకిస్థాన్‌లు ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనడం లేదు.. ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో తలప‌డుతున్న క్ర‌మంలో ఈ టోర్నీలో మ్యాచ్‌పై ఉత్కంఠ నెల‌కొంది.

Next Story