భార‌త్‌కు రెండో ప‌త‌కం.. చ‌రిత్ర సృష్టించిన‌ మను భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో నేడు నాలుగో రోజు. మను, సరబ్‌జోత్‌లు భారత్‌కు రెండో పతకాన్ని అందించారు.

By Medi Samrat  Published on  30 July 2024 9:21 AM GMT
భార‌త్‌కు రెండో ప‌త‌కం.. చ‌రిత్ర సృష్టించిన‌ మను భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో నేడు నాలుగో రోజు. మను, సరబ్‌జోత్‌లు భారత్‌కు రెండో పతకాన్ని అందించారు. ఈరోజు జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో వీరిద్దరూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఒలింపిక్స్‌లో మనుకి ఇది రెండో పతకం. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కూడా కాంస్యం సాధించింది.

కాంస్య పతక పోరులో భారత్ కు చెందిన మను భాకర్-సరబ్జోత్ సింగ్ జోడి 16-10తో దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే జిన్, లీ వోన్హో జోడీని ఓడించింది. ఓవరాల్ గా భారత్ ఎనిమిది రౌండ్లలో విజయం సాధించగా.. కొరియా ఐదు రౌండ్లలో విజయం సాధించింది. దీంతో కాంస్యం భార‌త్ వ‌శ‌మ‌వ‌గా.. మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. నార్మన్ ప్రిట్‌చర్డ్ 1900 సంవత్సరంలో రెండు పతకాలు సాధించాడు.. కానీ అతను బ్రిటీష్. మను మొదటి భారతీయురాలు. మను కంటే ముందు మరే ఇతర భారతీయ అథ్లెట్ ఒక్క ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేదు. సరబ్‌జోత్‌కు ఇదే తొలి ఒలింపిక్ పతకం.

రాష్ట్రపతి ముర్ము మను-సరబ్‌జోత్‌లను అభినందించారు. భారత్ నుంచి ఒకే ఒలంపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. మ‌ను ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల‌ మాకు చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని నేను మ‌ను, సరబ్‌జోత్ సింగ్‌ల‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఎక్స్‌లో రాశారు.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన మను భాకర్, సరబ్జోత్ సింగ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మా షూటర్లు మమ్మల్ని గర్వించేలా చేస్తూనే ఉన్నారు. ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మను భాకర్-సరబ్జోత్ సింగ్‌లకు అభినందనలు. ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించారు. భారతదేశం చాలా సంతోషంగా ఉందన్నారు.

Next Story